జనవరి నెలలో రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు
దేశ ప్రజలకు బంగారంపై మక్కువ మరింతగా పెరిగిపోతుంది. ఒకవైపు బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నప్పటికీ వీటి కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిల్లో విదేశాల నుంచి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ఈ యేడాది మొదటి నెల అయిన జనవరి నెలలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గత యేడాదితో పోల్చితే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ యేడాదిలో బంగారం ధరలు ఏకంగా 11 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది.
గత యేడాది జనవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇపుడది 2.68 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత యేడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, కొత్త యేడాదిలో పసిడి ధర 11 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88200గా ఉంది.