ఉత్తరాఖండ్ రాజకీయం : సొంత పార్టీలకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రభుత్వం మంగళవారం విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఈ పరీక్షకు ముందు... కొన్ని నాటకీయ పరిణామాలతో పాటు.. ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
హరీశ్ రావు విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖ ఆర్య షాక్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రలోభాలకు లొంగి సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో వెళ్లిపోయిన ఆమె.. మంగళవారం ఉదయం అసెంబ్లీ ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. ఇది కాంగ్రెస్ నేతలకు షాక్తో పాటు.. ఆందోళనకు లోను చేసింది.
అదేసమయంలో బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య సొంత పార్టీ ఝులక్ ఇచ్చి మాజీ సీఎం హరీశ్ రావత్కు జై కొట్టారు. ఆయన హరీశ్ రావత్తో కలసి అసెంబ్లీకి వచ్చి విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేశారు. ఇకపోతే.. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపారు. దీంతో హరీశ్ రావత్ సర్కారు విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కినట్టు సమాచారం.