శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మెడికోలు రాత్రిపూట బయటకు వెళ్ళొద్దు... అస్సాం వైద్య కాలేజీ హెచ్చరిక

doctor
అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ వైద్య కాలేజీ యాజమాన్యం మహిళా వైద్యులకు, వైద్య విద్యార్థినులకు ఓ హెచ్చరిక జారీచేసిది. అత్యవసరమైతే మినహా రాత్రిపూట ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది. కోల్‌కతాలోని ఓ వైద్య కాలేజీలో జూనియర్ మహిళా వైద్యురాలు హత్యాచారానికి గురై, దేశంలో సంచలనమైన విషయం తెల్సిందే. దీంతో అస్సాంలోని సిల్చార్ వైద్య కాలేజీ ఈ అడ్వైజరీని జారీచేసింది. రాత్రిపూట అత్యవసరమైతే మినహా హాస్టల్ దాటొద్దని హెచ్చరిక చేసింది. మహిళా వైద్యులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నోటీసుజారీచేసింది. అయితే, సెక్యూరిటీ పెంచకుండా సూచనలు ఇవ్వడంపై మెడికోలు మండిపడుతున్నారు. 
 
మహిళా వైద్యులు, మెడికోలు ఒంటరిగా ఉండే పరిస్థితి అవైడ్ చేయాలని పేర్కొంది. రాత్రిపూట హాస్టల్, లాడ్జింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్లొద్దని, ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులతో ఉన్నపుడు జాగరూకతతో వ్యవహరించాలన కాలేజీ యాజమాన్యం సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేసే కాంటాక్ట్స్ పెంచుకోవాలని మహిళా వైద్యులు, విద్యార్థులకు సూచించింది. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతగా లీనమైపోయినా చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ ఉండాలి చెప్పారు. 
 
అయితే, క్యాంపస్‌లో ఎలా ఉండాలో చెబుతూ మేనేజ్‌మెంట్ జారీచేసిన అడ్వైజరీపై స్టూడెంట్లు మండిపడుతున్నారు. క్యాంపస్‌లో హస్పిటల్‌లో మహిళా వైద్యులు, విద్యార్థులు రక్షణ కోసం సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచాల్సింది పోయి ఇలాంటి అడ్వైజరీ జారీ చేయడమేమింటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లొద్దు, ఒంటరిగా ఉండొద్దని తమకు బోధించడం కన్నా సెక్యూరిటీని పెంచే చర్యలు చేపట్టాలని కోరారు. క్యాంపస్‌లో లైటింగ్ సదుపాయాలను పెంచాలని, వైద్యుల రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ అడ్వైజరీపై విమర్శలు గుప్పిస్తున్నారు.