జయమ్మ కుర్చీ... భద్రత వద్దంటున్న సీఎం పన్నీర్ సెల్వం.. 24 గంటల్లో శశికళను 2 సార్లు కలిశాడు...
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓ.పన్నీర్ సెల్వంకు పట్టపగలే చుక్కలు కనపిస్తున్నాయి. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లో చేరిన మన్నార్గుడి మాఫియాతో ప
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓ.పన్నీర్ సెల్వంకు పట్టపగలే చుక్కలు కనపిస్తున్నాయి. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లో చేరిన మన్నార్గుడి మాఫియాతో పాటు అమ్మ ప్రియనెచ్చెలి శశికళ నుంచి ఆయనకు అపుడే లేనిపోని చికాకులు మొదలైనట్టు తెలుస్తోంది. దీనికి నిదర్శనంగానే గత 24 గంటల్లో శశికళను పోయస్ గార్డెన్లో రెండుసార్లు కలవడమే.
ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో సోమవారం అర్థరాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఓ పన్నీర్సెల్వం కూర్చొన్నారు. జయలలిత మంత్రివర్గంలోని మంత్రులనే ఆయన తన మంత్రివర్గంలో కూడా కొనసాగించారు. అయితే, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికీ ఆయన మాత్రం సీఎం కుర్చీలో కూర్చోరట. ఒక ముఖ్యమంత్రికి కల్పించే భద్రత అస్సలు వద్దనే వద్దట. అంతేనా.. సీఎంకు ప్రభుత్వం కేటాయించే బంగళా కూడా వద్దని, ఓ మంత్రిగా తనకు కేటాయించిన ఇల్లే చాలని తెగేసి చెప్పారు.
అంతేకాకుండా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి చాంబర్లో అడుగుపెట్టబోనని, అమ్మ కుర్చొన్న కుర్చీలో కూర్చోబోనని శపథం కూడా చేశారు. అలాగే, ఆనవాయితీగా మంత్రిమండలి సమావేశాలు నిర్వహించే మందిరంలో కూడా కేబినెట్ సమావేశాలు నిర్వహించబోరట. ఇలా తనకు తాను అనేక నిబంధనులు విధించుకుని పాలన సాగిస్తానని పన్నీర్ సెల్వం భీష్మించికూర్చొన్నారు.
మరోవైపు జయలలిత జీవించివున్న సమయంలో షాడో సీఎంగా ఉన్న శశికళ ఇపుడు అధికార కేంద్రంగా మారారు. ఫలితంగా పోయస్ గార్డెన్లో ఉంటున్న శశికళను గత 24 గంటల్లో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రెండుసార్లు కలవడం గమనార్హం. ఆయన తన వెంట పలువురు సీనియర్ మంత్రులను కూడా వెంటేసుకెళ్లి... శశికళతో మంతనాలు జరిపారు.
అయితే భేటీలో ఏం చర్చించారన్న విషయాలు విస్పష్టంగా తెలియనప్పటికీ... అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ తేదీ ఖరారు, 2017 ఫిబ్రవరి 24న జయ జయంతి నిర్వహణ తదితర విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జయ మరణించిన తర్వాత కూడా అధికారానికి కేంద్ర బిందువుగా పోయస్ గార్డెనే ఉంది. గత 40 ఏళ్లుగా జయ నివసించిన ఇంట్లో ఇప్పుడు శశికళ, ఆమె బంధువులు తిష్టవేసివున్న విషయం తెల్సిందే. పైగా, ఈ ప్రాంతం దరిదాపుల్లోకి కూడా మీడియాను రానివ్వక పోవడం గమనార్హం.