గోడ దూకే వారికి ఓటు కట్! జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఝలక్!!
భారత దేశంలోని ఆ రాష్ట్రం... ఈ రాష్ట్రం అని తేడాలు లేవు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే బేధాలు లేవు... దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో జంపింగ్ల పర్వం కొనసాగుతోంది. పూటకో ఎమ్మెల్యే పార్టీ మారి సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఓ పార్టీ టికెట్ పైన గెలిచి....ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఝలక్కిచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారిన ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కును రద్దు చేస్తూ, కోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి కూడా మొట్టికాయేనని చెప్పొచ్చు.
కోర్టు నిర్ణయం ప్రకారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొన్నటి దాకా కాంగ్రెస్ సభ్యులుగానే ఉండి, తాజాగా బీజేపీ పంచన చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు బల పరీక్షలో ఓటు హక్కుండదు. ఈ తీర్పు భవిష్యత్తులో గోడ దూకే ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికగా మారుతుంది.