శుక్రవారం, 25 జులై 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Updated : గురువారం, 1 జనవరి 2015 (14:39 IST)

2015లో మకర రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు (భో, జా, జి)
శ్రవణము 1, 2, 3, 4 పాదములు (జూ, జె, జో, ఖ) 
ధనిష్ఠ 1, 2 పాదములు (గా, గి)
ఆదాయం 5, వ్యయం 2, పూజ్యత 2, అవమానం 4

 
మకర రాశి వారికి జూలై 14 వరకు సప్తమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా, అష్టమము నందు, ఈ సంవత్సరం అంతా భాగ్యము నుందు రాహువు, తృతీయము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా లాభము నుంది శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'అంతా సుభానీ, అహోరాత్రః బుద్ధిం తపది తైజస్య' అన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. మంచి జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు ఎల్లపుడు గుర్తించబడుతూనే ఉంటారు. ఎటువంటి సమస్యలు ఉన్న తేలికగా పరిష్కరించుకోబడతాడు. మీలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వాణిజ్య రంగాల్లో వారికి ఆసక్తి పెరుగును. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పత్రికా, రచన రంగాల్లో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. విదేశాలకు వెళ్లటానికై చేయు యత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు, చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వ్యవసాయ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులు కాలాన్ని వ్యర్థం చేయకుండా విద్యను, ధనాన్ని సంపాదించే ధ్యాస అలవర్చుకోవాలి. శ్రమించడం వల్ల విద్యార్థుల్లో పురోభివృద్ధికి కానరాగలదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. పై చదువులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సభలు, సమావేశాల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒకసారి మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
పాత వ్యవహారాలు జ్ఞప్తికి వస్తాయి. వస్త్ర, పీచు, ఫోం లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకం. ఉపాధ్యాయులకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. విద్యా సంస్థల్లో వారికి శ్రమాధిక్యత, చికాకు తప్పదు. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి పనివారితో ఇక్కట్లు ఎదుర్కొనక తప్పదు. విద్యుత్ రంగాల్లో వారికి గుర్తింపు లభించగలదు. ప్రైవేటు రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారు మార్పుల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. 
 
ఈ రాశివారికి జూలై నుంచి అష్టమ గురుదోషం ఏర్పడుతున్నందువల్ల, ఈ క్రింది శ్లోకాన్ని తూర్పు వైపుగా తిరిగి 19 సార్లు పఠించిన సర్వదా పురోభివృద్ధి కానరాగలదు. 
 
"ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహీ తన్నో గురుః ప్రచోదయాత్"
విష్ణుసహస్ర నామం, ఖడ్గమాల చదవడం లేక వినడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 
 
** ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టు, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు, ధనిష్ట నక్షత్రం వారు జమ్మిచెట్టును ఖాళీ ప్రదేశాల్లో గానీ, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ నాటి దాని అభివృద్ధికి ప్రయత్నించిన మీరు అభివృద్ధి చెందుతారు. 
 
ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతికెంపు లేక స్టార్‌రూబి అనే రాయిని, శ్రవణా నక్షత్రం వారు స్పందన ముత్యం లేదా జాతిముత్యాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జాతి పగడాన్ని ధరించిన సర్వదా శుభం కలుగుతుంది.