శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జూన్ 2025 (09:02 IST)

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

murder
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమార్తె ప్రేమకు తండ్రి అడ్డుగా నిలిచాడు. ఇది ఆయన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో భార్య, ఇద్దరు కుమర్తెలు, ప్రియుడుతో కలిసి కన్నతండ్రిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన ధరావత్ కిషన్ (40) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కిషన్ చిన్న కుమార్తె పల్లవి అదే తండాకు చెందిన భూక్య సురేశ్ అనే యువకుడితో తరచూ ఫోనులో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఈ విషయంపై కుమార్తెను కిషన్ మందలించాడు. దాంతో తన ప్రేమను తండ్రి అంగీకరించడం లేదని పల్లవి తీవ్ర ఆగ్రహానికి గురైంది. 
 
ఈ క్రమంలోనే కిషన్ భార్య కావ్య, ఇద్దరు కుమార్తెలు రమ్య, పల్లవి, ఆమె ప్రియుడు భూక్య సురేశ్, మరో ఇద్దరు యువకులు బోడ చందు, దేవేందర్ కలిసి కిషన్‌పై దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి కిషన్‌ను తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను అతనికి తల్లికి సాంకి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించరు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కిషన్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై మృతుడు కిషన్ తల్లి సాంకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్ భార్య కావ్య, కుమార్తెలు రమ్య, పల్లవి, పల్లవి ప్రియుడు భూక్య సురేశ్‌తో పాటు దాడిలో పాల్గొన్న బోడ చందు, దేవందర్‌లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.