గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జూన్ 2025 (08:38 IST)

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

lovers
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్య ప్రియుడుతో ఉండగా చూసిన భర్త.. తీవ్ర ఆగ్రహంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హర్దోయ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 25 యేళ్లు మహిళ.. అదే గ్రామానికి చెందిన తన ప్రియుడుని కలిసేందుకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త రామ్ ఖిలావన్, భార్యను రహస్యంగా అనుసరిస్తూ ప్రియుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య ప్రియుడుతో ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన రామ్ ఖిలావన్, ప్రియుడి ఎదుటే భార్య ముక్కును బలంగా కొరికేశాడు. దీంతో ఆమె ముక్కుకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను హర్దోయ్ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రి తరలించాలని వైద్యులు సూచించారు. 
 
ఈ ఘటనపై అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, నిందితుడైన భర్త రామ్ ఖిలావన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.