మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (18:02 IST)

నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది : రజినీకాంత్ (video)

తనకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోందని, కానీ, తాను మాత్రం బీజేపీ మాయలో పడబోనని సౌత్ ఇండియన్ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. 
 
విశ్వనటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రజినీకాంత్ పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమకండి. తిరువళ్లువర్ వంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపకండి'  అని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదానికి తెరలేపింది. 
 
ఈ ఘటన బీజేపీ ప్రోద్బలంతోనే జరిగిందన్న రీతిలో రజినీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ రజినీ గతంలో చేసిన ప్రకటనలతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేశాయి.