శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (14:18 IST)

ఢిల్లీపైకి విష వాయువులను వెదజల్లుతున్న పాక్ - చైనా : బీజేపీ నేత

తమ పార్టీ అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కోలేక చైనా, పాకిస్థాన్ దేశాలు ఢిల్లీపైకి విషవాయువులను వెదజల్లుతున్నాయని బీజేపీ సీనియర్ నేత వినీత్ అగర్వాల్ ఆరోపించారు. 
 
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీనిపై వినీత్ అగర్వాల్ స్పందిస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏర్పడడానికి పాకిస్థాన్‌, చైనా దేశాలే కారణమన్నారు. 
 
మోడీ, అమిత్ షాలను చూసి పాకిస్థాన్‌ తీవ్ర ఆందోళనకు గురవుతుందన్నారు. వీరిద్దరిని ఎదుర్కొనలేకనే ఢిల్లీలోకి పాకిస్థాన్‌, చైనా దేశాలు కలిసి విషవాయువులను విడుదల చేస్తున్నాయని వినీత్‌ అన్నారు. దీంతోనే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్నారు. 
 
పంజాబ్‌, హర్యానా రైతులు తమ పంట పొలాల్లోని వ్యర్థాలను దహనం చేయడం ద్వారానే ఢిల్లీలో కాలుష్యం ఏర్పడిందన్న సీఎం కేజ్రీవాల్‌ మాటలను వినీత్‌ అగర్వాల్‌ తోసిపుచ్చారు. ఢిల్లీలో కాలుష్యం కేవలం పాకిస్థాన్‌ వల్లే అని ఆయన పేర్కొన్నారు.