1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (14:41 IST)

నాడు ఏఆర్ రెహ్మాన్.. ఇపుడు ఎంఎం కీరవాణి.. ఆస్కార్ మెరిసిన భారతీయ సంగీత దర్శకులు

mm keeravani
భారతీయ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, ఎంఎం కీరవాణిలు ఆస్కార్ వేదికలపై మెరిసారు. గతంలో ఏఆర్ రెహ్మాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఇపుడు కీరవారణి తెలుగు చిత్రం నాటు నాటు పాటకు స్వరాలు సమకూర్చి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. 1961 జూలై 4వ తేదీన జన్మించారు. తండ్రిపేరు శివదత్త. దివంగత సంగీత దర్శకుడు చక్రవర్తి శిష్యుడు.
 
ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన 'మనసు - మమత'తో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 'సీతారామయ్య గారి మనవరాలు'తో ఆయనకు బ్రేక్‌ వచ్చింది. 'మాతృదేవోభవ'తో కీరవాణి పేరు మార్మిగిపోయింది. ఈ చిత్రంలో 'రాలిపోయే పువ్వా..', 'వేణువై వచ్చాను భువనానికీ' గీతాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 
 
ఇకపోతే, విక్టరీ వెంకటేష్ నటించిన 'క్షణం క్షణం'లో కమర్షియల్‌ బ్రేక్‌ కొట్టారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో కీరవాణి చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. 'అల్లరి ప్రియుడు' క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 'అన్నమయ్య' నుంచి మరో చరిత్ర మొదలైంది. అప్పటి నుంచీ ఆధ్యాత్మిక చిత్రాలకు సంగీతం అనగానే మొదట కీరవాణినే గుర్తుకొస్తారు. ఈ సినిమాతో కీరవాణికి జాతీయ అవార్డు కూడా దక్కింది. 
 
దర్శకేంద్రుడితో దాదాపు పాతిక చిత్రాలు చేశారు. దాదాపుగా అగ్ర హీరోలందరి చిత్రాలకూ పని చేశారు. 'స్టూడెంట్‌ నెంబర్‌ 1'తో రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళితో ప్రయాణం ప్రారంభించారు. అప్పటి నుంచీ.. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' వరకూ ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది. 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకొన్న కీరవాణి.. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకొన్నారు. 
 
ఫలితంగా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కింది. ఇప్పుడు ఆస్కార్‌ అందుకొన్నారు. ఈ యేడాదే కీరవాణికి కేంద్రం పద్మశ్రీ కూడా ప్రకటించింది. కీరవాణికి ఇద్దరు కుమారులు. కాలభైరవ సంగీత దర్శకుడిగా మారితే, జై సింహా నటుడిగా ఇప్పుడిప్పుడే ప్రయాణం మొదలెట్టారు.