తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)
తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుడిపాల మండలం కుప్పిగానిపల్లె రామాపురానికి చెందిన సిద్ధయ్య తన భార్య, కుమారుడు, కుమార్తెతో కారులో తిరుపతి నుంచి ఇంటికి బయల్దేరారు.
అయితే హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా, కుమారుడు, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. సిద్ధయ్య పుట్టినరోజు కావటంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం కుటుంబం మొత్తం కారులో తిరుగు ప్రయాణం కాగా.. ఇంతలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
రామాపురం గ్రామంలో ఉండే సిద్ధయ్య తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు గిరి, గాయత్రితో కలిసి కారులో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్నారు. ఈ సమయంలోనే వారు ప్రయాణిస్తున్న కారు.. తూర్పుపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి.. డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న సిద్ధయ్య కుటుంబం మంటల్లో చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో సిద్ధయ్య, అతని భార్య జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గిరి, గాయత్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.