పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు స్థానికులను జాతీయ భద్రతా సంస్థ (ఎన్.ఐ.ఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఆదివారం ఎన్ఐఏ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రకటనలో ఎన్ఐఏ పేర్కొన్న వివరాల మేరకు.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి కారణమైన ముగ్గురు ముష్కరులకు ఆశ్రయం కల్పించిన పర్వీజ్, బషీర్ అనే ఇద్దరు స్థానికులను అరెస్టు చేశాం. వారిని ప్రశ్నించగా.. ఉగ్రవాదుల పేర్లను బయటపెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు పాక్ దేశీయులు. దాడి చేసినవారికి లష్కరే తొయ్యిబాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. దాడికి ముందు ఉగ్రవాదులని తెలిసే ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, ఆశ్రయంతో పాటు రవాణా సదుపాయం కూడా కల్పించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది' అని ఎన్ఐఏ పేర్కొంది.
కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ ప్రాంతమైన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారత్ దాడులకు వణికిపోయిన పాక్.. చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలనే లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ సైతం అంగీకరించింది.