భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లా దాన్ బహదూర్ డీహ్ గ్రామంలో ఓ భర్త.. తన భార్యకు మళ్ళీ పెళ్లి చేయించాడు. తన భార్య ప్రియుడుతో కలిసివుండటాన్ని కళ్ళారా చూశాడు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిద్దరికీ వివాహం చేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దన్ బహాదూర్ డీహ్ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర, కరిష్మా అనే దంపతులకు 15 యేళ్ళ క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో హరిశ్చంద్ర పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయన స్వగ్రామానికి వచ్చాడు. ఇదిలావుంటే, కరిష్మా అదే గ్రామానికి చెందిన శివరాజ్ చౌహాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గ్రామస్థులు ఉప్పందించారు. దీంతో తన భార్య ప్రవర్తనపై హరిశ్చంద్ర నిఘా పెట్టాడు.
ఈ క్రమంలో తన భార్య ప్రియుడు శివరాజ్ చౌహాన్తో ఏకాంతంగా ఉన్న సమయంలో హరిశ్చంద్ర చూశాడు. ఆ వెంటనే వారిద్దరినీ గ్రామంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లి వివాహం చేశాడు. కరిష్మా నుదుట శివరాజ్ సింధూరం పెట్టించి, పూలమాలలు మార్పించి పెళ్లి ఘట్టాన్ని పూర్తి చేయించాడు. ఈ వివాహానికి హాజరైన పలువురు గ్రామస్థలు చప్పట్లు కొట్టారు. భార్యకు ప్రియుడుతో వివాహం చేయించిన హరిశ్చంద్రను అభినందించారు.