శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్ చిత్రంలో నటించారా? కేసు నమోదు
మలయాళ నటి శ్వేతా మీనన్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్లీల కంటెంట్ ఉన్న చిత్రంలో ఆమె నటించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు కొచ్చిన్ సెంటర్ల పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, మార్టిన్ మేనచెరి అనే సామాజిక కార్యకర్త శ్వేతా మీనన్పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... 'పలేరి మాణిక్యం', 'రతి నిర్వేదం', 'కాళిమన్ను' వంటి చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలతో పాటు ఆమె కనిపించిన ఒక కండోమ్ వాణిజ్య ప్రకటనను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియా, అడల్ట్ వెబ్సైట్లలో అసభ్యకరంగా సర్క్యులేట్ అవుతున్నాయని, ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన ఆరోపించారు.
మార్టిన్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు. దీంతో ఆయన ఎర్నాకుళం చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. శ్వేత మీనన్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు శ్వేత మీనన్పై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలను పాటించడం మా విధి. అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇపుడు ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాం అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.