సోమవారం, 21 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (14:22 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మరో తారా చౌదరి - బ్యాంకు మాజీ మేనేజర్ రౌడీ షీటర్

davuluru padmavathi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తారా చౌదరి వెలుగులోకి వచ్చారు. ఆమె పేరు దావులూరి పద్మావతి. బ్యాంకు మాజీ మేనేజరు. దావులూరి పద్మావతి ఉచ్చులో బాధితులు ఎంతోమంది చిక్కుకున్నారు. బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్ ఇలా ఏకంగా 11 కేసుల వరకు ఉన్నాయి. అనేక మంది వద్ద రూ.లక్షల్లో మోసం చేశారు. బంగారం, డబ్బు దోచుకోవడం, బెదిరింపులకు పాల్పడటమే ఆమె దినచర్యలుగా మారిపోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏలూరు - నూజివీడు మండలంలోని మర్రిబంధం గ్రామానికి చెందిన మాజీ బ్యాంకు ఉద్యోగిని దావులూరి పద్మావతి గతంలో ఈమె ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తూ సీతారాంపురం గ్రామానికి చెందిన కవులూరి యోగి అనే వ్యక్తికి చెందిన బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టగా, వాటిని సదరు వ్యక్తికి తెలియకుండానే బ్యాంకు నుంచి విడిపించుకోవడంతో వారి మధ్య వివాదం తలెత్తింది. 
 
దీంతో దావులూరి పద్మావతిపై ఆమె బంధువులు సైతం తమను మోసగించిందని, తమ బంగారం, ఇంటి స్థలం, రూ.లక్షల్లో నగదును సైతం కాజేసిందంటూ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆమెపై దాదాపు 6 కేసులు నమోదు కాగా, కాలంలో రౌడీ‌షీట్ కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు దావులూరి పద్మావతిపై 11 కేసులు నమోదయ్యాయి. 
 
బంధువులను సైతం తనకు అడ్డువస్తే చంపివేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు పలుమార్లు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇదిలావుంటే, ఒక ప్రముఖ ఛానల్లో దావులూరి పద్మావతి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. వైసీపీ నాయకుడు కవులూరి యోగి ఆమెను మోసగించాడని, అన్ని విధాల వాడుకుని, తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడంటూ ఆరోపణలు చేయడంతో సదరు వైసీపీ నాయకుడు కవులూరు యోగి మీడియాను ఆశ్రయించారు.
 
గతంలో పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసినప్పుడు దావులూరి ప్రభావతి పేరిట 38 తులాల బంగారం తాకట్టు పెట్టడం జరిగిందని, తనకు తెలియకుండా ఆమె ఆ బంగారాన్ని విడిపించుకోవడంతో ఆమెపై పోలీస్ స్టేషనులో చేయడం జరిగిందన్నారు. ఆమెతో నేను సహజీవనం చేశానని, అన్ని విధాలుగా వాడుకున్న ప్రభావతి తనను మోసగించడంతో ఆమెను వదిలించుకున్నట్లు యోగి తెలిపారు. 
 
గతంలో ప్రభావతి ఎందరినో మోసగించి లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు యోగి ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు అన్ని తన వద్ద ఉన్నాయన్నారు. ప్రభావతిపై తాను అత్యాచారం చేశాడంటూ, కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుతో తనపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. 
 
దావులూరి ప్రభావతి తనతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రయాణించడంతోపాటు హోటల్స్‌లో కూడా బస చేసామని, ఏ సంబంధం లేకుండా తనతో ఎందుకు తిరిగిందంటూ యోగి ప్రశ్నించారు. ప్రభావతి చేష్టలు మన ఆంధ్రాలో మరో తారా చౌదరిని గుర్తుకి తెస్తున్నాయన్నారు. ప్రభావతి ఒక హనీట్రాపర్ అని, ఎంతమందిని మోసం చేసిందో తన వద్ద ఆధారాలు ఉన్నాయని యోగి మీడియాకు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలు అవాస్తవమని తేలితే తాను చట్ట పరంగా ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.