ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల్లో ఐక్యత కరవు.. ఒకరు ఇవ్వాలంటారు.. మరొకరు అవసరం లేదంటారు!
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు అధికార టీడీపీ నేతలు ఏమాత్రం కృషి చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. దీనికి కారణం వారు చేస్తున్న పరస్పర విరుద్ధమైన ప్రకటనలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనీ ఒకరు అంటే.. మరో నేత ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటారు. ఇలాంటి ప్రకటనలతో ప్రత్యేక హోదా అంశంపై తమలోనే ఐక్యత లేదనే విషయం తేటతెల్లమవుతోంది.
మొన్నటికిమొన్న టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని, విభజన చట్టం మేరకు పన్నుల్లో రాయితీలు ఇస్తే చాలని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పారు.
ఇపుడు తాజాగా, మరో కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్నిఅడగవలసిన మార్గంలో అడిగి ప్రత్యేక హోదాను ధించుకుంటామన్నారు.
అలాగే రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, దాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని అన్నారు. అలాగే ప్రజలందరూ సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని, ఎయిర్పోర్టుల్లో సోలార్ వినియోగాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆయన తెలిపారు.