1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (12:07 IST)

నేటి నుంచి గడపగడపకు వైస్సార్సీపీ

ysrcp flag
వైస్సార్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 11 నుంచి (అంటే నేటి నుంచి) గడపగడపకు వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమాన్ని వైకాపా చేపట్టింది. ఓ వైపు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, పవన్‌ కళ్యాణ్‌ రైతు భరోసా యాత్రలతో దూసుకుపోతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 
 
గడపగడపకు వైఎస్సార్సీపీ పేరుతో ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత నాయకులంతా నియోజక వర్గాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. 
 
ఎన్నికలకు రెండేళ్ల ముందే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీని ఓడించాలని టీడీపీ, జనసేన భావిస్తుంటే, మళ్లీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95శాతం పూర్తి చేశామని ఆ పార్టీ చెబుతోంది. 
 
ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారుల ఖాతాలకు లక్షా 38వేల 894కోట్ల రుపాయల నగదు బదిలీ చేశామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టనుంది.