జగన్కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కడపుమంట ఎక్కువైందని, అందువల్ల ఆయనకు ఈనో ప్యాకెట్లను పంపుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం అద్భుత విజయం సాధించిందన్నారు. దీన్ని చూసి జగన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అందుకే ఈ పథకం అమలుపై జగన్ రెడ్డి తన రోత పత్రిక ద్వారా మరోమారు అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు.
తల్లికి వందనం పథకం సూపర్ సక్సెస్... తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోమారు తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయి.
దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డిగారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల్లో అందరూ చేస్తారు అనుకుంటే ఎలా.. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం... చేయనివ్వం. జగన్ రెడ్డిగారూ కడుపు మంట ఎక్కువగా ఉన్నట్టుంది.. రెండు ఈనో ప్యాకెట్లు పంపుతాను వాడండి.. కాస్త తగ్గుద్ది అంటూ ఎద్దేవా చేశారు.