1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (17:43 IST)

బాబాయ్‌ని చంపిన హంతకులనే పట్టుకోలేకపోయారు.. పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు గత టీడీపీ ప్రభుత్వంలో హత్య చేశారన్నారు. అపుడు హడావుడి చేసిన వైకాపా అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులు.. ఇపుడు సాక్షాత్ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. అంటే.. ఒక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తన చేతిలో ఉన్నప్పటికీ సొంత బాబాయ్‌ని హత్య చేసిన హంతకులను ఇప్పటికీ పట్టుకోలేక పోయారని పవన్ ఆరోపించారు. 
 
గుంటూరులో ప్రకాశం జిల్లా నేతలతో పవన్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోగానే బెంబేలు పడే వ్యక్తిని కాదని.. గెలిచినా, ఓడినా చివరి వరకు పార్టీని నడుపుతానన పునరుద్ఘాటించారు. అదేసమయంలో గెలుపే ముఖ్యం అనుకుంటే వంద వ్యూహాలు పన్నేవాడినని అన్నారు. 
 
ఇకపోతే, తమపై కేసులు ఉన్నవారు కేంద్రం వద్ద తమ వాణిని బలంగా వినిపించలేరన్నారు. కేసులు ఉన్నవారు సీఎం అయితే.. ఎంత వరకు న్యాయం జరుగుతుందని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలన్నారు. తనకు జగన్‌, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని.. వారు తనకు నష్టం చేసినా పట్టించుకోనని పవన్‌ అన్నారు.
 
అదేసమయంలో డబ్బు, మద్యం పంచని ఎన్నికలు రావాలని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. నవంబర్ 3వ తేదీన విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.