ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 మే 2021 (19:07 IST)

రఘురామక్రిష్ణంరాజు కేసు ఫైనల్ తీర్పు ఎలా వుండబోతుంది?

ఈనెల 14వ తేదీ నరసాపురం ఎంపి రఘురామక్రిష్ణంరాజును అరెస్టు చేసినప్పటి నుంచి హైడ్రామా నెలకొంది. హైదరాబాద్‌లో అరెస్టు చేస్తే గుంటూరు సిఐడీ కార్యాలయానికి తీసుకురావడం.. రాత్రంతా విచారించడం.. ఆ తరువాత సిఐడీ కోర్టులో హాజరు పరచడం జరిగాయి.
 
సిఐడీ కోర్టులో తనను సిఐడీ అధికారులు దారుణంగా కొట్టారంటూ కాళ్లను చూపించారు రఘురామక్రిష్ణంరాజు. ఆయనే స్వయంగా జడ్జికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడం.. హైకోర్టు బెయిల్ ఇవ్వకుండా ఉండడంతో చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు.
 
సుప్రీంకోర్టులో రఘురామకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మొదట్లో తనకు ట్రీట్మెంట్ విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారని కోర్టును కోరాడు రఘురామక్రిష్ణంరాజు. అయితే సిఐడీ కోర్టులో మాత్రం జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో గుంటూరు సబ్ జైలుకు రఘురామను తీసుకెళ్ళారు. 
 
మళ్ళీ సుప్రీంకోర్టులో రఘురామకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పులో సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయాలని ఉంది. దీంతో నిన్న సాయంత్రం ఆయన్ను తీసుకొచ్చారు. ఈ జరిగిన స్టోరీ మొత్తం తెలిసిందే. అయితే ఆర్మీ ఆసుపత్రిలో రఘురామ ఉన్నంత వరకు అది జ్యుడీషియల్ రిమాండ్ గానే భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
అసలు రఘురామక్రిష్ణంరాజుపై పెట్టిన కేసు రాజద్రోహం కేసు. గతంలో ఇలాంటి కేసుల్లో శిక్ష అనుభవించింది ఇద్దరు మాత్రమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలావుంటే సుప్రీంకోర్టులో రఘురామకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు రఘురామ అనుకూల వర్గం. ఈ కేసులో మరో రెండు ఛానళ్ళను ముద్దాయిలుగా చేరుస్తూ ఎఫ్‌.ఐ.ఆర్. కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే మీడియా ఛానళ్ళపై కేసులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగమే అంటున్నాయి జర్నలిస్టు సంఘాలు.