కేసీఆర్ తో కుమ్మక్కైంది ఎవరు? నువ్వా.. నేనా..? : జగన్
పట్టిసీమను అడ్డుకుంటున్నట్లు దాని వలన రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతున్నట్లు, కేసీఆర్ తో కుమ్మక్కైనట్లు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను జగన్ తిప్పికొట్టారు. అసలు కేసీఆర్ తో మిలాఖత్ అయ్యిందెవరని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసం తెలంగాణ నిత్యం అవసరాలు చంద్రబాబుకు తప్ప తమకు ఉండవనీ, స్వార్థ ప్రయోజనాలను మనసులో పెట్టుకుని తమపై విమర్శలు కురిపిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు జగన్ విమర్శించారు. అసెంబ్లీ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు టెంకాయ కొట్టగానే కర్నాటక, మహారాష్టల్రు 35 టిఎంసిల నీటిని పట్టేసుకుంటాయని, పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమను ప్రతిపక్షం ఎందుకు వద్దంటున్నదోవినే ఓపిక ప్రభుత్వానికి, స్పీకర్కు లేదన్నారు. తాము మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
పట్టిసీమపై చర్చ జరగకుండా అంగన్వాడిల అంశాన్ని ముందుకు తెచ్చారని ఆయన తెలిపారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్ళేందుకు పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పుడు పట్టిసీమ చేపడితే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నదిలో మిగులు జలాలను వాడుకునే అధికారం మన రాష్ట్రానికి ఉందని, గోదావరిపై అటువంటి అధికారం లేదని ఆయన తెలిపారు. గోదావరి 130 రోజులు పొంగుతుందంటూ సిఎంగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో చెప్పించారని ఆయన అన్నారు. రాయలసీమపై ప్రేమ తమకే ఉందన్నట్లు టిడిపి మాట్లాడుతున్నదని ఆయన అన్నారు. పట్టిసీమ కాగితాల్లో రాయలసీమ అనే పదం ఎక్కడ ఉందో చూపించండి అని ఆయన ప్రశ్నించారు.