శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (10:28 IST)

చీకటి బాగోతానికి అడ్డుగా ఉన్నాడనీ మత్తు కలిపి భర్తను హత్య చేసిన భార్య

తమ చీకటి బాగోతానికి కట్టుకున్న భర్త అడ్డుగా ఉన్నాడనీ తన ప్రియుడుతో కలిసి మత్తమందు కలిపిపెట్టి హత్య చేసిందో వివాహిత. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతచెట్టు తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తండాకు చెందిన నేనావత్‌ రమేష్‌ (25), స్వప్న దంపతులు. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌గా రమేష్‌ పని చేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో పగలు వాచ్‌మెన్‌గా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బొంత నాగేంద్రబాబు అలియాస్‌ నాగరాజు పనిచేస్తున్నాడు. 
 
అతనికి, స్వప్నకు మధ్య పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. ఈ విషయం తెలిసి రమేష్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో గతనెల దీపావళి పండుగ సందర్భంగా రమేష్‌, స్వప్నలు సొంతూరు చింతచెట్టు తండాకు వచ్చారు. 
 
అక్కడ రమేష్ అడ్డు తొలగించుకోవాలని స్వప్న, నాగరాజు ప్రణాళిక వేశారు. ఆ మేరకు గతనెల 29న రమేష్‌ రాత్రి భోజనంలో స్వప్న మత్తుమందు కలిపింది. భర్త నిద్రలోకి జారుకోగానే ఫోన్‌లో నాగరాజుకు సమాచారం ఇచ్చింది.
 
స్వప్న ఇంటికి వచ్చిన నాగరాజు తన వెంట తెచ్చిన వైరుతో నిద్రలో ఉన్న రమేష్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. తొలుత దీన్ని సాధారణ మరణంగానే అంతా అనుకున్నారు. అయితే స్వప్న అనుమానాస్పద ప్రవర్తనతో మృతుని సోదరుడు నరేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో స్వప్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం ఘాతుకం వెల్లడయింది. దీంతో స్వప్న, ఆమె ప్రియుడు నాగరాజును కొండమల్లేపల్లి పోలీసులు నిన్న అరెస్టు చేశారు.