గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (10:12 IST)

కూర బాగోలేదని అలిగిన భర్త... బావిలో దూకిన భార్య... మనస్తాపంతో భర్త కూడా...

ఓ వివాహిత చిన్నపాటి విషయానికే బలవన్మరణానికి పాల్పడింది. దీంతో మనస్తాపం చెందిన భర్త కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన చీమల సాయికిరణ్, ములుగు జిల్లా రాజుపేటకు చెందిన శైలజ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి 10 నెలల పాప ఉంది. మిల్లులో పనిచేసే సాయికిరణ్ బుధవారం పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఈ క్రమంలో భోజనం చేసేందుకు కూర్చోగా కూర విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో సాయికిరణ్ అలిగి భోజనం చేయకుండా పనికి వెళ్లిపోయాడు. భర్త చర్యకు మనస్తాపం చెందిన భార్య శైలజ పాపను ఇంటి వద్దే వదిలి గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి దూకేసింది.
 
అదేసమయంలో అటువైపు నుంచి వస్తున్న పాఠశాల విద్యార్థులు ఆమెను గమనించి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని భర్త సాయికిరణ్‌కు చేరవేశారు. ఆయన ఆగమేఘాల మీద బావి వద్దకు చేరుకున్నాడు. 
 
అప్పటికే బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు శైలజ మృతదేహాన్ని వెలికే తీసే ప్రయత్నాల్లో ఉండగా, భార్య మరణాన్ని తట్టుకోలేని సాయికిరణ్ అకస్మాత్తుగా బావిలో దూకేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు అతడిని రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.