మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (14:42 IST)

దొడ్డిదారిలో కాదు.. రాజమార్గంలో తీసుకొస్తున్నా : పవన్ కళ్యాణ్

తన అన్న నాగబాబును క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అదీ కూడా దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని తెలిపారు.
 
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు బుధవారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తనలో రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలైందని, ఒక విధంగా చెప్పాలంటే నాగబాబే తనకు రాజకీయ గురువు అని చెప్పారు. అదేసమయంలో రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారినకాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని వ్యాఖ్యానించారు. 
 
నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరపున నాగబాబును పోటీకి దించుతున్నట్టు తెలిపారు. 
 
ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న నాగబాబు... తన పిలుపు మేరకు అన్నింటిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన నాగబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.