1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:42 IST)

ఒక మాజీ ముఖ్యమంత్రి కోసం మరో మాజీ సీఎం ప్రచారం.. ఎవరా ఇద్దరు మాజీలు?

chandrababu - kiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం రాయలసీమ ప్రాంతంలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకపుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేటకు వెళ్లి ప్రచారం చేశారు. ఎన్డీయే కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని రాజంపేట ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని గుర్తుచేశారు. తామిద్దరం సుధీర్ఘకాలంగా రాజీయాల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్ళకు రాజంపేట ద్వారా తమ కాంబినేషన్ కుదిరిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని గొప్ప మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
పనిలోపనిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్‍కు ఎన్నికలపుడు ఏదో ఒక డ్రామా అలవాటని, గత ఎన్నికల సమయంలో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పొందే ప్రయత్నం చేశారని, కోడికత్తి డ్రామా కూడా ఆడారని ఆరోపించారు. ఇపుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. ఆ గులకరాయి మేమే వేయించామని అంటున్నాడని, ఆ గాయం రోజు రోజుకూ పెద్దవుతుందని, మానడం లేదని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.