శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. ముగ్గురి మృతి

car accident
విశాఖ - భీమిలి రహదారిలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన కొందరు యువకులు ముగ్గురి ప్రాణాలు తీశారు. వీరిలో భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఈ కారు తొలుత చెట్టుకుని ఢీకొని, ఆ తర్వాత ఎదురుగా ఉన్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు వెనుకసీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న ఒక యువకుడు కూడా చనిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... 
 
సాగర్ నుంచి ఎండాడ వైపు వెళుతున్న కారు రాడిసన్ హోటల్ మలుపు వద్ద అదుపు తప్పింది. తొలుత డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టుని ఢీకొట్టింది. అవతలిపైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న పృథ్విరాజ్ (28), ప్రియాంక (21) దంపతులు అక్కడికక్కడే మృతి చెదారు. వీరిది ఒడిశాలోని రాయగడగా గుర్తించారు. పృథ్వీరాజ్ ఓ సంస్థలో సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. 
 
మరోవైపు, ప్రమాదం ధాటికి కారు వెనుక సీట్లో కూర్చొన్న ఎం.మణికుమార్ (25) తీవ్రంగా గాయపడి కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. వీరంతా మద్యం సేవించివున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందు వీరంతా సాగర్ నగర్ ఆర్చ్ వద్ద కొందరు యువకులతో వాగ్వివాదానికి దిగారు రోడ్డుపై మద్యం సీసాలు పగులగొట్టి నానా రభస చేశారు. పైగా, ఆ యువకుల మొబైల్ ఫోను కూడా లాక్కొని వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.