1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (20:51 IST)

నిబంధనలకు విరుద్ధంగా తిరిగిన 62 బస్సులు సీజ్

సంక్రాంతి పండుగ సందర్భంగా  వారి స్వస్థలాలకు అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా సుధీర ప్రాంతాల నుండి రాకపోకలు జరుగుతాయని, దానిని అదనుగా తీసుకొని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులు నిర్ణీత రుసుము కంటే, అధిక మొత్తంలో టిక్కెట్ ధరలను పెంచి వసూలు చేస్తున్నారని, అటువంటి వారిని ఎట్టి పరిస్థితులల్లో సహించేది లేదని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు హెచ్చరికలు జారీచేశారు.
 
స్థానిక డిటిసి కార్యాలయం నుండి మంగళవారంనాడు ఒక ప్రకటనను జారీచేశారు. డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని అటువంటి బస్సులపై కేసులు నమోదు చెయ్యడమే కాకుండా, బస్సులను సీజ్ చెయ్యడం కూడా జరిగిందని డిటీసీ తెలిపారు.

ఒక్కరోజులోనే మొత్తం 62 బస్సులను సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. జిల్లాలోని నాలుగు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు, కీసర టోల్ ప్లాజా వద్ద తనిఖీలను నిర్వహించామన్నారు.

వివరాల్లోకి వెళితే కనకదుర్గమ్మ వారధి వద్ద 8 కేసులు, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద 21 కేసులు, గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 7 కేసులు, కేసర టోల్ గేట్ వద్ద 26 కేసులు నమోదు చేసినట్లు డిటిసి తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై నిఘా ఉంచామన్నారు. ఈ తనిఖీలు కొనసాగిస్తామని డిటిసి అన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్దిష్టమైన ధరలకు టికెట్ల అమ్మకాలు జరపాలని డిటీసీ వెంకటేశ్వరరావు కోరారు. ప్రయాణికుల నుండి టికెట్ల దరలుకంటే, అధిక ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోపిడీకి గురి చేయొద్దని, టిక్కెట్లను ధరలను పెంచి అధిక వసూళ్లు చేయొద్దని ప్రైవేటు ట్రావెల్స్  యజమానులను డిటీసీ కోరారు.

ఈ తనిఖీలలో వాహన తనిఖీ అధికారులు కె ఆర్ రవికుమార్, బద్దునాయక్, బి వి మురళి కృష్ణ, నాయుడు, జె నారాయణస్వామి, కె శివరాంగౌడ్, యం సంగీతరావు, కె ఎస్ ఎన్ ప్రసాద్,జి ప్రసాదరావు పాల్గొన్నారు.