1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (10:01 IST)

ఏపి పోలీస్ సేవా యాప్ ద్వారా 96 పోలీసు సేవలు: డీజీపి

మహిళా సంరక్షణే ధ్యేయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంద‌ని రాష్ట్ర డీజీపి గౌత‌మ్ స‌వాంగ్ పేర్కొన్నారు.

పోలీసు శాఖలో పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై అపోహలు, అనుమానాలు వద్దు అని పేర్కొంటూ పోలీస్ శాఖ త‌ర‌ఫున రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌లు, శాఖాప‌రంగా సిబ్బంది సంక్షేమం తీసుకుంటున్న చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఈ మేర‌కు డీజీపి గౌత‌మ్ స‌వాంగ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న  గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతున్నాయి.

ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశ్యంతో, గ్రామ సచివాలయంలో  గ్రామ/ వార్డ్ మహిళ సంరక్షణ కార్యదర్శి అనే పోస్ట్ ను సృష్టించి సుమారు 15000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది.

వీరి సేవలను మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశ్యంతో  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళ పోలీస్‌గా గుర్తిస్తూ ఈ మధ్యనే ఉత్తర్వులను జారీ చేసింది.

పోలీసు శాఖ ప్రతినిధిగా, మహిళా పోలీసులు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి అద్భుతమైన సేవలను అందిస్తున్నారు. ఇప్పటికే, 20 లక్షల మందికిపైగా మహిళలు దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎపి పోలీస్ సేవా యాప్ ద్వారా 96 పోలీస్ సేవలను అందిస్తున్నారు.

గ్రామ/వార్డు సచివాలయాలకు అనుసంధానంగా ఇప్పుడు మహిళా పోలీసులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండడంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంద‌న్న భరోసాతో మహిళలు ఉన్నారు. గ్రామంలో పోలీస్‌స్టేషన్ యొక్క విస్తరించిన మరో అస్త్రం ఈ మహిళా పోలీసు. వారికి పోలీసు శాఖ అధికారాలు, విధులు త్వరలో ఇవ్వబోతున్నాం.

ఇదిలా ఉంటే పోలీసు శాఖలో శిక్షణ అనేది కీలకమైన అంశం అన్న విషయాన్ని గుర్తించాలి.  కఠోర శిక్షణ ఆంధ్రప్రదేశ్ పోలీసు ను అత్యున్నత స్థానంలో నిలబెడుతోందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అందుకే ఈ మహిళ పోలీసు లకు కూడా అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు పూనుకొన్నాం. ఇప్పటికే ప్రాధమిక శిక్షణ పూర్తయ్యింది. విడతల వారిగా వీరికి క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వ బోతున్నాం.

ఆంద్రప్రదేశ్ పోలీసు శాఖ లో శిక్షణ ఇచ్చే వనరులు పరిమితమన్న విషయాన్ని గుర్తించాలి. మన సామర్థ్యం చూస్తే, కేవలం విడతకు 6500 మంది కి మాత్రమే శిక్షణ ఇవ్వగలం . 17000 మంది మహిళా పోలీసుకు క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మరి కొన్ని నెలలు పట్టె అవకాశం ఉంది.

14000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలేదు అన్న విషయంలో నిజానిజాలను చూస్తాం. ముందుగా 15000 మహిళా పోలీసులు పోలీసు శాఖలో చేరారన్న విషయాన్ని అందరూ గుర్థించాలి. పోలీసు శాఖలో వారి చేరిక ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు గర్వకారణం, దేశానికే ఆదర్శం. 

పోలీసుశాఖలో  మహిళ భాగస్వామ్యం 33 శాతం ఉండాలన్న జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరి  నియామకం చేబట్టడం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కీర్తిని ఇనుమడింపజేస్తుద‌నడంలో ఎటువంటి సందేహం లేదు. 2019-20లో ఇప్పటికే 3057 మంది కానిస్టేబుళ్ల ను రిక్రూట్ చేసుకొని,  శిక్షణ ఇచ్చి డ్యూటీ లో చేర్చుకొన్నాం.

ఇంకా 11000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే మహిళా పోలీసుల క్యాప్స్సూల్ శిక్షణ ఉండడం వల్ల, మరియూ శిక్షణ సామర్థ్యం 6500 మాత్రమే కావడం వల్ల ప్రభుత్వం వచ్చే జాబ్ క్యాలెండర్ నుండి సంవత్సరానికి 6500 చొప్పున భర్తీ చేయాలని నిర్ణయించారు.

అయితే దీనిని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరం. కాబట్టి పోలీసు శాఖలో చేరాలనుకొనే ఆశావహులు, నిరుత్సాహం చెందకుండా, కొంత ఓపిక వహించాలని మనవి.

ఉద్యోగ నియామకాల విషయానికొస్తే, ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 1,84,264  రెగులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19701 ఉద్యోగాలు, ఔట్ సౌర్చింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2193 మొత్తం 605949 ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, రికార్డులను పరిశీలిస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో  కేవలం 34563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందేన‌ని డీజీపి గౌత‌మ్ స‌వాంగ్ వెల్ల‌డించారు.