1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (21:42 IST)

మొదటి రోజు ఆపరేషన్ ముస్కాన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 4257 మంది పిల్లలకు విముక్తి- డిజిపి

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం  ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పలు నిర్ణయాలను ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యంగా అట్టి అనాధ పిల్లలకు తక్షణ వసతి కల్పించాలని, వారి పేరున 10,00,000 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని  పిల్లల సంక్షేమమే పరమావదిగా పోలీసు శాఖ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో నిర్వహించిన మాదిరిగానే మరో సారి ఆపరేషన్ ముస్కాన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది.
 
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సవాంగ్ గారు ఈ మేరకు  తగిన కార్యాచరణ రూపొందించగా, అందుకనుగుణంగా జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది యావత్తు,  కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ  వీధి బాలలు, చిన్నారులు, బాల కార్మికుల విముక్తి కొరకై  ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. ఈ ఆప‌రేష‌న్‌లో పోలీస్ శాఖ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు స్వచ్చందంగా పాల్గొన్నాయి.
 
ఈ సందర్భంగా ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, జ‌న‌సామ‌ర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, వర్క్ షాపులు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీల వద్ద తనిఖీలు నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్గించడం జరిగింది. ఇందుకుగాను ప్రతి పోలీసు స్టేషన్లో ఒక ప్రత్యేక టీమ్‌ల‌ను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతీ టీమ్‌లో మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు.  
 
ఈ త‌నిఖీల సందర్బంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆపరేషన్ ముస్కాన్ లో గుర్తించి స్వాదీనం చేసుకున్న పిల్లలను 24 గంటలలోపు ఆయా జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తారు. చైల్డ్ వెల్ఫర్ కమిటీల ద్వారా దొరికిన   పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం, సరైన చిరునామా దొరకని పిల్లలను షెల్టర్ హోంలలో పునరావాసం కల్పించడం జరుగుతుంది.
 
ఈ ఆపరేషన్ సందర్భంగా 4257 మంది చిన్నారులకు విముక్తి కలిగించడం జరిగింది. అందులో 3622 బాలలు మరియూ 635 బాలికలు వున్నారు. ఇందులో ఐదేళ్ల లోపు 417 మంది, 6- 10 సంవత్సరాల లోపు 1061 మంది, 11- 15 సంవత్సరాల లోపు 2779 మంది వున్నారు.  
 
కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులు ఇద్దరు వున్నారు. వారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా పునరావాసం మరియూ డబ్బు జమ చేయబడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విముక్తి కలిగించిన 4257 మందికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించగా అందులో ఇప్పటికే 12 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇంకా చాలామంది టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. కోవిడ్ సోకిన అట్టి చిన్నారులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ కోవిడ్ ఇనిస్టిట్యూషన్ లకు తరలించడం జరిగింది. వారు పూర్తి గా కొలుకునేంత వారకు వారి సంరక్షణ భాధ్యతను తీసుకోవాలని డీజీపీ గారు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. మరో రెండు రోజులు ఈ ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుందని డీజీపీ గారు తెలిపారు.