శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (15:11 IST)

ఢిల్లీలో ఎయిరిండియా ఆఫీసుకు తాళం.. గోవా సంచలన నిర్ణయం

ఢిల్లీలోని ఎయిరిండియా కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ అని నిర్ధారణ అయింది. దీంతో  ఈ కార్యాలయాన్ని అధికారులు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మూసివేశారు. 
 
కరోనా నిర్ధారణ అయిన వ్యక్తి గత గురువారం బుద్ధ పూర్ణిమ నాడు ఆఫీసుకు హాజరైనట్టు గుర్తించారు. సోమవారం నాడు కరోనా అని తేలడంతో ఆఫీసులో కూడా ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు ఉండొచ్చని భావించి సెలవు ప్రకటించారు. 
 
ప్రస్తుతం ఆఫీసు లోపలి భాగం, ఆవరణను క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. కాగా, కరోనా సోకిన ఆ ఉద్యోగికి సంస్థ నుంచి అన్ని విధాలుగా సాయం అందుతుందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
 
టూరిస్ట్ స్పాట్‌లకు గ్రీన్ సిగ్నెల్ 
మరోవైపు, గోవాలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా గత 50 రోజులుగా మూతపడివున్న పర్యాటక ప్రాంతాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. గోవా ప్రధానంగా పర్యాటక ఆదాయంపైనే ఆధారపడివుంది. లాక్డౌన్ కారణంగా ఈ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రభుత్వ ఆదాయం కనిష్టానికి చేరడంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
 
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, పక్కనే సరిహద్దులను పంచుకుంటున్న కర్ణాటక వాసులు మినహా మిగతా రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి పర్యాటకులు రావచ్చని పేర్కొంది. కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలని, పరిమితులు కూడా విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
రాష్ట్రానికి వచ్చే వారిని పరిమిత సంఖ్యలో అయినా, రైలు, విమాన, అంతర్రాష్ట్ర రోడ్డు మార్గాల ద్వారా అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ నెల 17 తరువాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గోవాను తిరిగి తెరుస్తామని, విధించిన నిబంధనలు పాటిస్తూ, కొన్ని పరిమితుల్లో పర్యాటకులను అనుమతించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.