శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (18:04 IST)

ప్రపంచంలోనే తొలిసారి : వందే భారత్‌ మిషన్ ప్రారంభం

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుని పోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ ఆపరేషన్ కోసం "వందే భారత్ మిషన్‌" అనే నామకరణం చేసింది. ఈ తరహా ఆపరేషన్ చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి, పైగా అతిపెద్దది కూడా. ఈ ఆపరేషన్ ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది.
 
ఈ ఆపరేషన్‌లో భాగంగా, అబుదాబి నుంచి 170 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం గురువారం రాత్రి కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన కేరళ ప్రభుత్వం 14 రోజుల హోం క్వారంటైన్‌కు తరలించింది. 
 
మరవైపు, సింగపూర్ నుంచి 234 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ ప్రత్యేక విమానం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అదేవిధంగా, మొదటి విడతలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి 168 మంది భారతీయులను మన దేశానికి తీసుకువస్తున్నారు. ఈ ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం బయలు దేరిందని, నేరుగా శ్రీనగర్‌లో ల్యాండ్ అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 
 
అలాగే, వివిధ ప్రపంచ దేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశీనికి తీసుకునిరానుంది. ఇందుకోసం 64 విమాన సర్వీుసులను భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతోంది. కేవలం స్వదేశానికి రావాలని భావించిన వారినే ఈ విమానాల్లో తీసుకొస్తారు. విమాన ఛార్జీలను ప్రయాణికులే భరించాల్సివుంటుంది. వివిధ దేశాలకు భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ చార్జీలను కూడా కేంద్రం నిర్ణయించింది. గరిష్టంగా రూ.50 వేలు, కనిష్టంగా రూ.12 చొప్పున ఖరారు చేశారు.