'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశించినవేనా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం 'రాజాసాబ్'. జనవరి 9వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం నుంచి తొలి పాటను ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ, 'కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చిన్నవి అవుతాయి' అని కామెంట్ చేశారు. ఇవి వైరల్ అవుతున్నాయి.
గతంలో 'వార్ 2' విడుదల సమయంలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తూ ఆ చిత్రం గురించి వివరించారు. దీంతో కొందరు అభిమానులు ఎన్టీఆర్ను ఉద్దేశించి మారుతి ఈ కామెంట్ చేశారంటూ పోస్ట్లు పెట్టారు. అలా పోస్ట్ పెట్టిన ఒక అభిమానికి మారుతి క్లారిటీ ఇస్తూ రిప్లై ఇచ్చారు.
'నేను నా కామెంట్స్పై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ప్రతి అభిమానికి నా క్షమాపణలు. ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని కానీ, అగౌరవపరచాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదు. స్టేజ్పై మాట్లాడే సమయంలో ఒక్కోసారి ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. నేను చెప్పిన దాన్ని పూర్తిగా భిన్నంగా అర్థం చేసుకున్నారు.
నా కామెంట్స్ ఇలా ప్రజల్లోకి వెళ్లినందుకు బాధగా ఉంది. నాకు ఎన్టీఆర్, ఆయన అభిమానులంటే చాలా ఇష్టం. వారిని గౌరవిస్తాను. ప్రతి అభిమాని సినిమాలకు ఇచ్చే విలువను చూసి నేను చాలా సంతోషిస్తాను. నేను ఆయనని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదు. దీనిపై నేను మనస్ఫూర్తిగా వివరణ ఇస్తున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని మారుతి పేర్కొన్నారు.