భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఓ దారుణం జరిగింది. భర్త పెడుతున్న చిత్ర హింసలతో విసిగిపోయిన ఇద్దరు భార్యలు ఓ దారుణానికి పాల్పడ్డారు. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన భీమ్గల్ మండలం దేవక్కపేటలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దేవక్కపేటకు చెందిన మలవత్ మోహన్ (42)కు ఇద్దరు భార్యలు కవిత, సంగీత ఉన్నారు. మోహన్ తరచూ మద్యం తాగుతూ.. భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి వారిద్దర్నీ గదిలో బంధించాడు. దీంతో విసిగిపోయిన భార్యలిద్దరూ అతడిని వదిలించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం.. సోమవారం ఉదయం పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకొచ్చారు.
ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మోహన్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భార్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.