మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...
ఓ యువతి తన ప్రియుడుని మోసం చేసి పెళ్లి చేసుకుంది. మలేషియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టుగా నమ్మించి ఈ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మదురైలో జరిగింది.
పోలీసుల వివరాల మేరకు... మదురై అనుప్పానడి ప్రాంతానికి చెందిన ధర్మరాజ్కు ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తె దివ్య(28) మూడేళ్ల క్రితం ఎంఎస్సీ చదవడానికి మలేసియా వెళ్తానని ఇంట్లో చెప్పింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంది. మొదట రూ.5 లక్షలు చెల్లించాలని, మదురై నుంచి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి విమానంలో మలేసియా వెళ్లాలని తెలపడంతో ఇంట్లో వారు నమ్మారు. ఆ మేరకు రూ.5 లక్షలు, ప్రయాణ ఖర్చులు తదితర వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వెళ్లింది. ఇప్పటికీ ఇంట్లో వారు దివ్య మలేసియాలోనే ఉంటోందని అనుకుంటున్నారు. ప్రతినెలా ఆమెకు డబ్బులు పంపుతున్నారు.
ఈ క్రమంలో దివ్య మలేసియా వెళ్లలేదని, మదురైలోనే ఉన్నట్లు ప్రకాష్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో దిగ్భ్రాంతి చెందారు. దివ్యకు తనతో వివాహమైందని, తమకు రెండేళ్ల కుమార్తె ఉందని, తాము ఊర్లోనే ఉన్నామని, కుటుంబ కలహాలతో దివ్య ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిందని, ఆమెను కాపాడి మదురై మాట్టుద్దావనిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు ప్రకాష్ తెలిపారు.
దీంతో ధర్మరాజ్ విచారించగా దివ్య, ప్రకాష్ తిరుప్పరకుండ్రంలో ఉంటున్నట్లు తెలిసింది. అనంతరం ధర్మరాజ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రకాష్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రకాష్, దివ్య మధ్య ఏర్పడిన గొడవల కారణంగా దివ్య ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిందని, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తేలింది.