ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన నైతిక విలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో పాటు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటివారు ఎంతో అమూల్యమైన సందేశాన్ని బాలబాలికలకు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఈ రాష్ట్ర భవిష్యత్తు తరంపై చంద్రబాబు గారి తాపత్రయం చూసిన తర్వాత, ఆయన సంకల్పానికి కొంచెమైనా ఉపయోగపడినా చాలు అని అనుకున్నాను. ఈ మాటలు నా నోట్లో నుంచి కాదు… నా గుండె నుంచి నుంచి చెప్తున్నా.
పిల్లలు తల్లి, తండ్రి, గురువు, తోబుట్టువులు ఇలా అందరిపట్ల ప్రేమాభిమానాలను కలిగి వుండాలి. తల్లికి చెప్పకుండా చేసే పనిని చేయకూడదు. తల్లికి చెప్పేది కాదని అనుకున్నప్పుడు అది నీవు తప్పు చేస్తున్నావని అర్థం. కనుక తల్లికి చేసిన తప్పును చెబితే, ఆ తప్పు మరలా చేయవద్దని చెబుతుంది. ఈ లోకంలో బిడ్డను క్షమించగలవారు ఒక్క తల్లి మాత్రమే. అలాగే తండ్రి ప్రేమ అపారమైనది. తన సంతానానికి ఎలాంటి సమస్య లేకుండా తన ఊపిరి వున్నంత వరకూ శాయశక్తులా బిడ్డల కోసం శ్రమిస్తాడు. ఇక గురువు... తన శిష్యుడు ఉన్నత స్థానానికి వెళితే ఎంతో సంతోషపడతాడు. అలాగే తోబుట్టువులు. మనస్పర్థలు వచ్చినా తోడబుట్టినవారిని వదులుకోకూడదు. అలా వదిలుకుంటే, కుటుంబ సభ్యులతోనే సఖ్యత లేనివాడు ఇక సమాజంలో ఎలా కలిసి వుంటాడు.
కనుక పిల్లలు చిన్ననాటి నుంచి నైతిక విలువలకు కట్టుబడి వుండాలి. చదువు విషయానికి వస్తే... పరీక్షల్లో పాసవుతామో లేదోనన్న ఒత్తిడి. దాన్ని అధిగమించేందుకు ప్రణాళికలు వేసుకోవాలి. ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు చదువుదాము అనే ఉత్సాహంతో నిండి వుండాలి. అంతేకాని రేపు పరీక్షలయితే ఈరోజు చదివితే ఎట్లా కుదురుతుంది. ఒకవేళ ప్రణాళికాబద్ధంగా చదివినా ఫెయిల్ అయితే... భారతరత్న అబ్దుల్ కలాం గారిని గుర్తుకు తెచ్చుకోండి అంటూ ఎన్నో అమూల్యమైన సలహాలను ఆయన బాలబాలికలకు ఇచ్చారు. ఆయన పూర్తి ప్రసంగం మీకోసం...