బుధవారం, 26 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మార్చి 2025 (16:31 IST)

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

anchor shyamala
ఆన్‌లైన్ బెట్టింగులను ప్రమోట్ చేశారనే కేసులో వైకాపా మహిళా నేత, యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‍‌లో శ్యామలను పోలీసులు దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించారు. 
 
విచారణ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, బెట్టింగును ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యత గల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. 
 
బెట్టింగులకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడటం సరికాదని చెప్పారు. 
 
మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!
 
వైకాపా నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. ఆయన వద్ద ఉండే డిగ్రీ సర్టిఫికేట్ నకిలీదంటూ ప్రచారం సాగుతోంది. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టనున్నారు. 
 
శ్రీకాకుళం లోక్‌సభ స్థానం వైకాపా ఇన్‌చార్జ్ అయిన తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ధృవీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారన, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కూన రవికుమార్ వెల్లడించారు. 
 
తమ్మినేని తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్‌ వేసినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.