ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (17:11 IST)

ఏపీలో వలంటీర్లకు రూ.750 ప్రోత్సాహక నగదు : సర్కారు వెల్లడి

volunteer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింద. ప్రస్తుతం అందిస్తున్న రూ.5 వేల నెల వేతనంతో పాటు ఇకపై రూ.750 ప్రోత్సాహక నగదును అందజేయనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం శనివారం వెల్లడించింది. రేషన్ సరకులను ఇంటింటికీ సరఫరా చేస్తూ క్రియాశీలకంగా ఉండటంతో ఈ ప్రోత్సాహక నగదును అందజేయనున్నట్టు తెలిపింద. ప్రతి నెల రూ.750 మొత్తాన్ని సరఫరాల శాఖ ద్వారా వేరేగా అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అధ్యక్షతన జరిగిన పౌర సరఫరాల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేషన్ సరకులను ఇంటికి చేరవేయడంలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. అయితే, వలంటీర్లకు ఈ ప్రోత్సాహక నగదు బహుమతిని ఎప్పటి నుంచి అందజేస్తారన్నది తెలియాల్సివుంది. 
 
సీనియర్ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసుల గాలింపు? 
 
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. గత 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకావడం లేదు. కోర్టు ఆదేశించినా ఆమె పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆమెకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ అయింది. వచ్చే నెల 10వ తేదీన ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆమె కనిపించకపోవడంతో రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. 
 
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని దంపతులు 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు శనివారం కలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన త్రవాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే రేవంత్‌ను అక్కినేని నాగార్జున తన సతీమణి అక్కినేని అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది.