1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (11:19 IST)

ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. మంగళవారం కొలువుదీరిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 
 
కరోనా వ్యాప్తి, ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని, అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించడంతో, రాజ్‌‌భవన్ నుంచే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా, మన దేశంలో ఓ గవర్నర్ ఇలా ఆన్2లైన్ మాధ్యమంగా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. అంటే ఏపీ నవశకానికి నాందిపలికింది. 
 
మరోవైపు, గవర్నర్ హరించన్ త ప్రసంగంలో ప్రభుత్వం ఓ నవ శకానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయని అంచనా వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నదని, ప్రజలకు మేలు కలిగేందుకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నదన్నారు. ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలను ఇప్పటికే నెరవేర్చామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని, మరో 39 హామీలను పరిశీలిస్తున్నామని అన్నారు.

అలాగే,2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ప్రాజెక్టు పనులకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని, ఇకపై ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుందని తెలియజేశారు. 
 
వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరమే పూర్తవుతుందని, అవుకు రెండో సొరంగాన్ని, సంగం బ్యారేజ్, వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తి చేయనున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
కాగా, గవర్నర్ ప్రసంగం తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు.