మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (10:59 IST)

ఏపీ శాసనమండలి రద్దు.. గట్టినేతలు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసి, మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపోతే, శాసనమండలి రద్దుతో అనేక మంది గట్టి నేతలు పదవులను కోల్పోనున్నారు. అలాగే, ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. నిజానికి మరో యేడాది తర్వాత శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో అధికులు రిటైర్‌ అవుతున్నారు. 2021, 2023లలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా రిటైర్‌ అవుతుంటే.. ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. 
 
వైసీపీలో శాసనసభ్యులకు ధీటైన స్థాయిలో ఉన్న నేతలకు శాసనమండలిలో స్థానం కల్పించడం ద్వారా.. నేతలందరికీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచేందుకు వీలుకలుగుతుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. శాసనమండలి రద్దయితే పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు వంటివారు తమ ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోతారు.

వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానాలు ఖాళీచేసి, ఆరునెలల్లో వాటికి ఎన్నికలు జరిగితేనే వారు మంత్రివర్గంలో కొనసాగే వీలుంటుంది. లేనిపక్షంలో వారుకూడా మంత్రిపదవులను కోల్పోవాల్సి వస్తుంది.

అలాగే, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లతో పలువురు సీనియర్ నేతలు కూడా తమ శాసనమండలి సభ్యత్వాలను కోల్పోనున్నారు.