1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (15:46 IST)

నెలవారీ పింఛన్ల పెంపుపై కసరత్తు.. జూన్ నెలలో రూ.7 వేలు!!

money
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఇచ్చే వివిధ రకాల పింఛన్ల మొత్తాన్ని పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్ల సొమ్మును పెంచి అందిజేయనున్నారు. 
 
రూ.4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చాయి. 
 
పింఛను జులై 1వ తేదీన అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. 
 
వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ.1.939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలు+ ఏప్రిల్ నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు) చొప్పున, దివ్యాంగులకు రూ.6 వేల పింఛనుకు జులై 1వ తేదీన పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 
 
ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం రూ.3 వేలు పింఛను తీసుకుంటున్నారు. 
 
వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవికాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.