శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (13:01 IST)

ఇంటి వద్దకే పింఛన్లు.. ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు

ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వలంటీర్ల వ్యవస్థ సత్తా చాటింది. పొద్దు పొడవకముందే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మధ్యాహ్నం కంతా పూర్తయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పింఛన్ల పంపిణీపై పటిష్టమైన యంత్రాగం ఏర్పాటు చేసి, 13 జిల్లాల్లోని 58.99 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. 
 
పింఛన్లకోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వాన్ని పూర్తిస్థాయిలో అరికట్టారు. మారుమూల ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు చేశారు. ఒకటో తేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు పింఛన్‌ నగదును అందజేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ సందర్భంగా తొలినెల (ఫిబ్రవరి-2020)లో ఎదురైన సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్‌ పెట్టారు. 
 
ఇంటివద్దకే వలంటీర్లను పంపి లబ్ధిదారుల చేతిలోకి నగదు అందేలా చేశారు. 58,44,642 పింఛన్లలో మధ్యాహ్నం 1 గంటలకు 45.24 లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేశారు. అర్హులైన గత నెల పింఛన్లు అందనివారికి, వెరిఫికేషన్‌ పూర్తైన వారికి ఒకేసారి రూ.4,500 అందజేశారు. పింఛన్ల పంపిణీపై రియల్‌ టైం డేటా, జిల్లాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించారు.