1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (07:18 IST)

కార్మికుల సార్వత్రిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య మద్దతు

కేంద్రప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన కార్మిక,ఉద్యోగ సంఘాలు ఐక్యంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తన పూర్తి మద్దతును తెలుపుతోందని సమాఖ్య కన్వీనర్  సి.హెచ్. బాబురావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరు గారుస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, జాతి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదనీ, కరోనా కష్టకాలంలో కార్మికులను, ఉద్యోగులను ఆదుకోకుండా గాలికొదిలేసిందని ఎద్దేవ చేశారు.

కష్టాల్లో ఉన్న ప్రజకు నెలకు 7500 రూపాయలు నగదు బదిలీ చేయాలనే కోర్కెను పెడచెవిన పెట్టిందన్నారు. పట్టణాల్లోనూ ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, కార్మిక సంఘాలు కోరుతున్నాయనీ, ఈ ప్రధాన కోర్కెలన్నీ కార్మికులు ఉద్యోగులకే కాక పట్టణ పౌరులు అందరి సంక్షేమానికి ఎంతగానో అవసరం అని పేర్కొన్నారు.

మరోవైపు పట్టణ సంస్కరణల పేరుతో ఆస్తి పన్నుల పెంపు, యూజర్ చార్జీలు, చెత్తపన్ను పట్టణ ప్రజల పైన మోపడం సమంజసం కాదన్నారు. అందుకే అటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెకు సమాఖ్య తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు.

మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాలనుఅమలులోకి నిరంకుశంగా తెచ్చి, రైతాంగాని కి తీరనిహాని కలుగచేయడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, రిటైల్ వర్తకంలోకి కూడా కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు మరింత చొచ్చుకు రావడానికి కారణం అవుతున్నాయని అన్నారు.

రైతులకే కాకుండా సాధారణ వినియోగదారుల ప్రయోజనాలను ప్రభుత్వాలు దెబ్బతీస్తున్న  ఇటువంటి తరుణంలో ఈ నెల 26, 27 తేదీల్లో రైతు సంఘాల ఐక్యవేదిక తలపెట్టిన ఆందోళనకు సమాఖ్య పూర్తి మద్దతు ప్రకటిస్తోంది.

వివిధ నగరాలు, పట్టణాల్లోని పౌర సంఘాలు ప్రత్యక్షంగా ఈసమ్మెకు, ఆందోళనలకు సంఘీభావం తెలియజేయాలని సమాఖ్య విజ్ఞప్తి చేశారు.