గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (16:16 IST)

సాధారణ కార్యకర్తలపై అంతులేని అభిమానం చూపిన సీఎం చంద్రబాబు

Chandra babu
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు పార్టీ కార్యర్తలపై అంతులేని అభిమానాన్ని చూపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన ఇద్దరు సాధారణ కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడిన ఆసక్తికర సన్నివేశం నేడు సచివాలయంలో చోటు చేసుకుంది.
 
ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. 
 
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా వాళ్లిద్దరూ అక్కడికి వచ్చేవారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు స్కూటీపై వచ్చి ఉత్సాహంగా పాల్గొనేది. వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ చంద్రబాబు పర్యటనలను ముందుగానే తెలుసుకుని అక్కడికి చేరుకునేవాడు. 
 
గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో కూడా ఆ ఇద్దరు కార్యకర్తలు కొన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండి బాబు ఎప్పుడు బయటకు వస్తారా? అని ఆత్రుతగా ఎదురు చూశారు. 
 
తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన ఆ ఇద్దరిని గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా గురువారం నాడు పిలిపించుకున్నారు. దుర్గాదేవిని, శివరాజు యాదవ్ ను ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని వాకబు చేశారు. 
 
సాక్షాత్తూ తమ అభిమాన నాయకుడే నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గాదేవి, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఎంత విలువ ఇస్తారన్నదానికి ఇదొక మచ్చుతునక.