ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల సమయం మార్పు.. టీ ఎంసెట్కు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్ష ఫలితాల విడుదల సమయంలో మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీన నీట్పై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఈ మార్పు చేసినట్టు చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు 9న విశాఖలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువరించినున్నట్లు చెప్పారు.
మరోవైపు.. తెలంగాణలో ఎంసెట్ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఈ నెల 15న ఎంసెట్ ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. అదే రోజున కీ విడుదల చేస్తామని.. ఫలితాలను 27న వెల్లడిస్తామని రమణారావు తెలిపారు. జూన్ 20 లోపు మొదటి విడత, రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని వివరించారు. జులై మొదటి వారంలో ఇంజినీరింగ్, మెడిసిన్ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.