1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:18 IST)

చంద్రబాబు, జగన్ చేసిన అప్పులు రూ. 5 లక్షల కోట్లు

ఏపీ సీఎంలు గా చంద్రబాబు, జగన్ చేసిన అప్పులు 5 లక్షల కోట్లకు చేరాయ‌ని బిజెపి నేత‌, మాజీ ఛీఫ్ సెక్ర‌ట‌రీ ఐ వై ఆర్ కృష్ణా రావు చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంద‌న్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పంచుతూపోతే పంచడానికి ఇక ఏమీ మిగలద‌ని కృష్ణారావు పేర్కొన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అందకునే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేద‌ని, బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరిపోతుంటే మౌలిక సదుపాయాల మాటేమిట‌ని ప్ర‌శ్నించారు. రోడ్ల దుస్థితి, ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని పరిస్థితి ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుంద‌న్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెన్షన్లు, జీతాల అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు 35% సరిపోతుంద‌ని, భవిష్యత్తులో నెల నెలా జీతాలు చెల్లించడం కూడా కష్టమే అన్నారు. 
 
ఇప్పటికే ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పుగా ఇవ్వాలని అడుగుతున్న అధికారులు, ఇకపై తమ నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింద‌న్నారు. చెప్పినవన్నీ  చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్ర దండం గాని, అల్లావుద్దీన్ అద్భుతదీపం గాని లేవని గ్రహించాల‌ని మ‌జీ సీఎం చెప్పారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాద‌ని, కేంద్రం ప్రభుత్వ తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చ‌న్నారు. రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితి ప్రజలు గమనించి ఆలోచించాల్సిన అవసరం ఉంద‌ని, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుంద‌న్నారు.