1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:28 IST)

సాయి తేజ మృతిపై గవర్నర్ బిశ్వ‌భూష‌న్ సంతాపం

తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా అధికారి లాన్స్ నాయక్ బి. సాయి తేజ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. లాన్స్ నాయక్ బి. సాయి తేజ 2013లో జవాన్‌గా ఆర్మీలో చేరారని, ఆయన అత్యుత్తమ పనితీరు ఆధారంగా సిడిఎస్‌కు పిఎస్‌ఓగా నియమితులయ్యారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు.
 
 
అతి చిన్న వయసులో లాన్స్ నాయక్ సాయి తేజ ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.  మరోవైపు హెలికాప్టర్‌లోని ఇతర రక్షణ సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఒడిశాలోని అంగుల్ జిల్లా కృష్ణచంద్రపూర్ గ్రామానికి చెందిన భారత వైమానిక దళానికి చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్ మృతి పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం కారణంగా పలువురు ఇతర  అధికారులు అకాల మరణం చెందటంపై ఆవేదన వ్యక్తం చేశార. భారతావని రక్షణ కోసం వీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.