1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (17:07 IST)

మూడు రాజధానులపై సందేహం వద్దు : మంత్రి అంబటి రాంబాబు

ambati
ఏపీ మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అక్కర్లేదని, తమ విధానం మూడు రాజధానులేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, మూడు రాజధానులపై ఎలాంటి రాద్ధాంతం అక్కర్లేదన్నారు. వైసీపీ విధానం మూడు రాజధానులే అని స్పష్టంచేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అంటూ చెప్పుకొచ్చారు. 
 
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే అనే స్థానిక భావాలున్నాయని... వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు అని తెలిపారు. జనసేన అధినేత పవన్‌పై మంత్రి అంబటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌‌నే చాలా పచ్చబొట్లు వేసుకోవాలన్నారు. వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అంటూ ప్రశ్నించారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలని హితవుపలికారు. వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్‌కే ఉందన్నారు. లోకేష్, పవన్‌లకు నిబద్ధత లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
 
బుధవారం ఉదయం భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌‌ను ఆయన ప్రారంభించారు. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయన్నారు. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో ఇక్కడి ల్యాబ్ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖలలో డెటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని... రూ.16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
 
ఇకపోతే, లోకేష్‌ యువగళం పాదయాత్రపై విరుచుకుపడ్డారు. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేరన్నారు. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అని లోకేష్ అన్నారన్నారు. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు.