శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో పంచాయతీ పోరుపై సర్వత్రా ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. సోమవారం సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించబోతున్నది. దీంతో రేపు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందనే ఆసక్తి నెలకొన్నది. 
 
శనివారం రోజున ఏపీ ఎస్ఈసి తొలివిడత ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ చేయగా, సోమవారం నుంచి తొలివిడత నామినేషన్లు జరగాల్సి ఉన్నది. అయితే, నామినేషన్లకు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లను అధికారులు చేయలేదు. ప్రస్తుతం కోడ్ అమల్లోనే ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. 
 
ఇదిలావుంటే, ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసి నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ హౌస్ మోషన్ పిటిష‌న్‌ను దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారికి ఓటుహక్కు ఉందంటూ పిటిషన్ దాఖలైంది. 
 
గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3 లక్షల 60 వేలమంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయగా, మొత్తం ఏడుదశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని ఇప్పటికే ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు. నిన్న ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌కు అనేక జిల్లాలకు చెందిన అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకాలేదు.  
 
ఇదిలావుంటే, ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎవరు ఆటంకం కలిగించినా దానిపై గవర్నర్‌కు నివేదిక అందిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.