1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (09:40 IST)

మాట్లాడుదామని పిలిచి రేప్ చేసిన మిత్రుడు.. షాక్‌తో చనిపోయిన మానస

వరంగల్ జిల్లాలో జరిగిన మానస హత్యకేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె పట్ల మిత్రుడే కాలయముడని పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజున సరదాగా మాట్లాడుకుందామని ఇంటికి పిలిచి ఆపై అత్యాచారం చేశాడు. మిత్రుడు చేష్టలకు దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి షాక్‌కు గురై చనిపోయినట్టు తేలింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్డులో జరిగిన ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి మానస ఉంటోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండకు చెందిన పులి సాయిగౌడ్‌ అలియాస్‌ సాయికుమార్‌ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
 
హంటర్‌ రోడ్డు వైపు వచ్చిపోయే సాయికుమార్‌తో మానసకు పరిచయం ఏర్పడగా... తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. బుధవారం పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లొస్తానని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకు మానస బయటకొచ్చింది. అతడు ఫోన్‌ చేసి కాజీపేటకు రావాలని చెప్పడంతో ఆటోలో అతడు చెప్పిన చోటుకే వెళ్లింది.
 
అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న సాయికుమార్‌.. మానసను ఎక్కించుకొని పెద్దపెండ్యాల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ మానసపై అత్యాచారానికి ఒడిగట్టాడు. షాక్‌తో ఆమె మృతిచెందడంతో సాయికుమార్‌ ఆందోళన చెందాడు. మృతదేహాన్ని కారులోకి ఎక్కించి ఆరుగంటల పాటు శివార్లలో తిరిగాడు. తన స్నేహితులు శ్రీకాంత్‌, శ్రీకాంత్‌రావును సహకరించాలని కోరగా వారు నిరాకరించారు.
 
ఆ తర్వాత సాయికుమార్‌ హన్మకొండ చౌరస్తాకు చేరుకుని ఓ షాపులో పంజాబీ డ్రెస్సు కొన్నాడు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి వచ్చి మృతదేహంపై రక్తపు మరకలతో ఉన్న లంగా ఓణీని తొలగించి పంజాబీ డ్రెస్సును తొడిగాడు. రాత్రి 9 గంటల సమయంలో మృతదేహాన్ని హంటర్‌ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. మానస ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు.
 
ఆమె కోసం పలుచోట్ల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంటర్‌ రోడ్డులో లభించిన మృతదేహం మానసదేనని నిర్ధారణ కావడంతో బోరుమన్నారు. మృతదేహం పడివున్న తీరు, జననాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని తొలుత భావించారు.
 
అయితే, మానస మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా స్నేహితుడే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. ఆ తర్వాత సాయికుమార్‌ నమిలిగొండలో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సాయికుమార్‌ జరిగిందంతా వెళ్లగక్కాడు.